సమత అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు ఈరోజు (30/01/2020) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో
నిందితులుగా ఉన్న ముగ్గురు దోషులు షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్ధుంలకు ఉరిశిక్షను విదిస్తు న్యాయస్థానం
తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు వెలువడించిన మరుక్షణం నిందితులు కంటతడి పెట్టుకున్నారు. ఇది దారుణమైన హేయమైన చర్య
అని తన తీర్పులో కోర్టు తెలిపింది. న్యాయస్థానం తీర్పుతో సమత కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

గతేడాది నవంబర్ 24న కొమురంభీం అసిఫాబాద్ జిల్లలోని లింగాపూర్‌ మండలం ఎల్లపటార్‌ గ్రామంలో సమత అత్యాచారం మరియు హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే సమతను అదే గ్రామానికి చెందిన షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్‌, షేక్‌ ముఖ్ధుంలు సామూహిక అత్యాచారం చేసి పాశవికంగా హతమార్చిన ఘటనను తెలంగాణా ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది.

కేసు విచారణకు డిసెంబర్ 11, 2019న ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31న కోర్టు విచారణ
పూర్తి చేసింది. డిసెంబర్ 14న ముగ్గురు దోషులపై 144 పేజీల చార్జీషీట్ ధాఖలు చేశారు పోలీసులు. అయితే నిందితుల
తరపున వాదించడానికి ఒక్క లాయర్ కూడా ముందుకు రాకపోవడంతో కోర్టు రహీమ్ అనే లాయర్ ను నియమించింది కోర్టు.

కుటుంబసభ్యులు, గ్రామస్తులతో సహా మొత్తం 44 మంది సాక్షులను విచారించింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు. జనవరి 27నే సమత కేసులో తుది తీర్పు వెలువడించాల్సి ఉండగా జడ్జ్ అనారోగ్య కారణంగా కోర్టుకు రాకపోవడంతో ఈరోజుకు వాయిదా పడింది తీర్పు.

ప్రత్యేక కోర్టు తీర్పు ఇంత త్వరగా ఖరారు చేయడంపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే శిక్ష అమలు కూడా త్వరగా జరగాలని ప్రతీ ఒక్కరు ఆశిస్తున్నారు.

ఇది కూడా చదవండి: పద్మ అవార్డులు 2020 గ్రహీతల జాబితా