కరోనా వైరస్ తెలంగాణాలో విస్తరిస్తున్న పలు వార్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒకేఒక్క కేసు నమోదైందని అది కూడా దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి. 47 మందికి గాంధీ ఆసుపత్రిలో స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 45 మందికి నెగటివ్ అని చూపించగా మరో ఇద్దరి వ్యక్తుల రిపోర్టులను స్పష్టత కోసం పుణె కు పంపించినట్టు ఈటెల వెల్లడించారు. ఈ 45 మందిని ఇంటికి పంపించాము. వారు 24 గంటలు మా పరిశీలనలో ఉంటారు.
పుకార్లు వదంతులు నమ్మవద్దు – ఈటెల
ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి అనుమానాస్పదంగా ఉంది. అంతే తప్ప రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తికి కరోనా వైరస్ సోకలేదు. సోషల్ మీడియాలో అనవసరంగా తప్పుడు సమాచారాలను షేర్ చేస్తున్నారు, అలా అవాస్తవాలు నలుగురికి చేరవేయడం తగదు.
మహేంద్ర హిల్స్ లో బాధితుడి ఇంట్లో అతనితో పాటు ఉన్న నలుగురు కుటుంబ సభ్యులకు నెగటివ్ రిపోర్టు వచ్చింది. ఇంట్లో కలిసి ఉన్న వ్యక్తులకే రానప్పుడు అంత సులభంగా ఇతరులకు సోకదు. అనవసర భయాలు సృష్టించవద్దు. మైండ్ స్పేస్ లో కూడా ఒకరికి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు వస్తున్న వార్తలో నిజం లేదు.
సిటీలో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా ప్రజల్లో అవగాహన కలిపించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఈ వైరస్ కు సంబంధించి ఏలాంటి సందేహాలు వచ్చిన 104కు కాల్ చేసి తెలుసుకోగలరు.
ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు – ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది
మెడికల్ కాలేజీలు సైతం ముందుకు వచ్చి ఐసొలేషన్ మాత్రమే కాకుండా గాంధీ తరహాలో వైద్య సహాయం చేస్తామని, అలాగే ప్రయివేట్ ఆసుపత్రుల్లో కూడా వారి శాంపిల్ లు ఇవ్వొచ్చు. అలాగే 50 పడకలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాపించలేదు. 24 గంటలు చాలా అప్రమత్తంగా ఉన్నాము. సీఎం కెసిఆర్ కూడా పైసల విషయం ఆలోచించవద్దు అని, మరియు పలు కమిటీలు వేసి వీటికి ఐఏఎస్ స్థాయి అధికారి మానిటర్ చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాము. ముఖ్యమంత్రి గారు ప్రతీ రెండు గంటకోసారి మా ద్వారా అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అని ఈటెల రాజేంద్ర చెప్పారు.
మనిషి ప్రాణాలు తీసే శక్తి కరోనాకు లేదు
మనిషి ప్రాణాలు తీసే శక్తి కరోనా వైరస్ లేదని, 81 శాతం వైరస్ సోకిందని తెలియని వాళ్ళు నయమై ఇంటికి వెళ్లారు. కేవలం 14% మందికి మాత్రమే వైద్యం అవసరం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నప్పుడు అనవసరంగా ఆందోళనకు గురై తప్పుడు అపోహలను నమ్మవద్దు అని చెప్పారు. ఈరోజు 20 మంది కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు, అవి కూడా నెగటివ్ అవుతాయని మేము ఆశిస్తున్నాము. కరోనా వైరస్ లేని రాష్ట్రంగా ఉండాలని ప్రజలు సంస్థలు కోరుకుంటున్నామని అదే నిజమవుతుందని ఆశిద్దాం అని తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు.