డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్ – 14 రోజుల రిమాండ్‌

డ్రోన్ కెమెరాలు వాడిన కేసులో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్

మంత్రి కేటీఆర్ లీజ్ కు తీసుకున్న ఫామ్‌హౌస్‌ను డ్రోన్‌తో చిత్రీకరించారనే ఫిర్యాదుతో మల్కాజ్‌గిరి కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఆ తర్వాత ఆరోగ్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఆస్పత్రికి తరలించిన అనంతరం పోలీసులు రేవంత్‌ రెడ్డిని ఉప్పరపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసం ఉండే రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో హాజరు పర్చారు. దీంతో జడ్జ్ రేవంత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. అక్కడి నుంచి పోలీసులు రేవంత్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.

ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కు విరుద్ధంగా మరియు ప్రైవేట్ ప్రాపర్టీలో అక్రమంగా డ్రోన్ కెమెరాలతో తమ అనుచరులతో చిత్రీకరించాడు అనే అభియోగాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారు ఎస్‌వోటీ పోలీసులు. అయితే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ లో భాగంగా మినిస్ట్రీ అఫ్ హోమ్ అఫైర్స్ ఉత్తర్వుల ప్రకారం డ్రోన్ కెమెరాలు వాడకూడదు అనే నిబంధనలు ప్రదేశంలో వాడినందుకు దీన్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేయడం వల్ల స్టేషన్ బెయిల్ రాని కారణంగానే జడ్జి ముందు ప్రవేశపెట్టడం జరిగింది.

224/2020లో సెక్షన్‌ 184,187 ఐపీసీ, 11ఏ రెడ్ విత్ 5ఏ, ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద అభియోగాలు మోపి కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే ఇదే విషయమై రేవంత్ రెడ్డి అనుచరులు కృష్ణారెడ్డి, విజయసింహారెడ్డి, ప్రవీణ్‌పాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ఓం ప్రకాష్‌రెడ్డి, రాజేష్‌, శివలను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే రేవంత్ రెడ్డి నేరుగా నర్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు విషయమై సీఐ తో మాట్లాడగా ఇది వరకే ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కేసు నమోదు అయి ఉండడంతో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.